Wednesday, September 22, 2010

కలామ్ డ్రైవర్ .. ... కాలేజ్ లెక్చరర్

కలలు కనే శాస్త్రవేత్త దగ్గర పని చేస్తే మన కలలూ నెరవేర్చుకోవచ్చనడానికి కదిరేసన్ ఉదాహరణ. మన మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ దగ్గర ఒకప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేసిన కదిరేసన్ ఇప్పుడు పిహెచ్‌డి పూర్తి చేసిన కాలేజీ లెక్చరర్. అదెలా జరిగిందంటే...
కదిరేసన్ చిన్నప్పుడు అందరిలాగే స్కూలుకెళ్లాడు. కాని ఒకరోజు మధ్యాహ్నం 'మీ నాన్నగారు చనిపోయార'ంటూ పాఠశాలకు కబురొచ్చింది. చావంటే ఏంటో తెలియని చిన్నతనం అతనిది. తన జీవితం ఏదో అగాథంలో పడిపోబోతున్నదని అప్పుడతనికి తెలియదు.

పెద్ద దిక్కు పోయిన బాధలో కన్నతల్లి.. ఇంట్లో చిల్లిగవ్వలేక కాలుతున్న కడుపు.. స్కూలుకు వెళుతున్న పిల్లల్ని చూసినప్పుడు తెలియకుండానే కారే కన్నీళ్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు నిండాలంటే కనిపించిన దారిలో నడవాల్సిందే. బతుకుతెరువులో అతని ప్రయాణం మొదలయింది. పనికోసం వేట.. పైసా కోసం వెతుకులాట.. దొరికిన ఉద్యోగమల్లా చేస్తూనే వచ్చాడు. కొంత కాలం ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి 1979లో ఇండియన్ ఆర్మీలో చేరాడు.

టర్నింగ్ పాయింట్
1980లో కదిరేసన్ అబ్దుల్ కలామ్ దగ్గర డ్రైవర్‌గా చేరాడు. కలామ్ అప్పుడు భోపాల్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేస్తుండేవారు. కలామ్‌కి కదిరేసన్ బాగా నచ్చాడు. కదిరేసన్ తన ఆశయాలను అభిలాషలను ఎప్పుడూ కలామయ్య(కలామ్ గారిని కదిరేసన్ అలాగే పిల్చేవాడు)తో చెబుతుండేవాడు. కలామయ్య ఎక్కడికి వెళ్లినా ఆయనతోపాటు వెళ్తుండేవాడు కదిరేసన్.

చదువుకోవాల్సిన అవసరాన్ని గురించి కలామయ్య విద్యార్థులకు చెబుతున్నప్పుడు చాలాసార్లు విన్నాడు. ఆ మాటలే ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. "ఒక రోజు కారులో వెళ్తుండగా 'నువ్వు నీ చదువు ఎందుకు కొనసాగించకూడదు కదిరేసన్?' అని అడిగారు కలామయ్య. "అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనేంటి ఇప్పుడు చదువుకోవడం ఏంటి? అనుకున్నాను. కలలు కన్నావు. ఆ కలల్ని ఎందుకు నిజం చేసుకోకూడదు. ప్రయత్నించి చూడు అని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేనిది'' అని చెప్పారు కదిరేసన్. కలామ్ దగ్గర ఆయన ఐదున్నర సంవత్సరాలు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే మళ్లీ చదువు మొదలుపెట్టాడు.

పది నుంచి పిహెచ్‌డి వరకు
చిన్నప్పుడే వదిలేసిన పుస్తకాలన్నీ తిరిగి చదవడం ప్రారంభించాడు. పదింటి నుంచి ఆరింటి వరకు ఉద్యోగం పూర్తయ్యాక ఇంటికి వెళ్లి కష్టపడి చదివేవాడు. పది పాసయ్యాడు. తర్వాత ఇంటర్, మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి దూర విద్యలో బిఏ, ఎంఏ పొలిటికల్ సైన్స్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి బిఇడి, ఎంఇడి, మళ్లీ కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశాడు. తర్వాత లా కూడా చేసి సుందరనర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేశాడు.

2001లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పాసయ్యాడు. "నేను పిహెచ్‌డి పూర్తి చేసిన తర్వాత మొదటిసారి కలామ్ అయ్యగారికి ఫోన్ చేశాను. నాకు ఉద్యోగం వచ్చిన విషయం కూడా చెప్పాను. అందుకు ఆయన చాలా సంతోషించి నన్ను దీవించారు. ఆ దీవెనలు నా జీవితంలో నేను మరిచిపోలేనివి. అంతకంటే గొప్పవి ఈ ప్రపంచంలో నాకు ఇంకేమీ లేవు. ఆయనకు నా మీద నమ్మకం ఉంది. దాన్ని నేను ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకున్నాను'' అని ఎంతో ఆనందంగా చెప్పాడు కదిరేసన్.

నాలాంటి వాళ్లకు సహాయం చేస్తా...
కదిరేసన్‌కు ఇప్పుడు 47 ఏళ్లు. ఆయన పుట్టి పెరిగింది వడచెన్నిమలైలో. ఇప్పుడు ఆయన అక్కడే అరిగర్ అన్న గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. "మా మాష్టారి గారి జీవితం ఒక అద్భుతమైన కథ. జీవితంలో అన్ని కష్టాలు, బరువు బాధ్యతలు ఉండి కూడా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని చూశాక ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదన్నది నిజమని అపిస్తుంటుంది.

ఎంతో దృఢ సంకల్పం ఉంటే కానీ అది సాధ్యం కాదు'' అని చెప్పాడు కదిరిసేన్ విద్యార్థి సంతోష్ మణి. "అప్పట్లో పరిస్థితులు అనుకూలించక చదువు మానేసి పనిలో చేరాను. నా జీవితంలో అత్యంత బాధాకరంగా తీసుకున్న నిర్ణయం అది. అందుకే చదువుకోవాలని ఆలోచన ఉన్నా అవకాశం లేని వాళ్లకు నా వంతు సహాయం చేయాలనుకుంటున్నాను'' అని ముగించారు కదిరేసన్.

Thursday, September 16, 2010

'కుట్టి' అంజులి

'కుట్టిస్రంక్'... గురించి ముగ్గురు మహిళల విభిన్న ధృర్పథాలే ఈ సినిమా కథ. దీన్ని తీస్తున్నప్పుడు దర్శకుడు షాజి కరుణ్ ఊహించి ఉండడు..ఈ సినిమాకు జాతీయ అవార్డుల పంట పండుతుందని. అలాగే కథరీత్యా తాను పరిచయం చేస్తున్న ఓ ఛాయాగ్రాహకురాలు ఈ సినిమా ద్వారా భారతీయ చలనచిత్రసీమలోనే చరిత్ర సృష్టిస్తుందని.

ఓ వ్యక్తి గురించిన ముగ్గురు మహిళల అభిప్రాయాల సమాహారం కాబట్టి దాని దృశ్యీకరణకు కూడా స్త్రీ దృక్పథం తోడైతే మరింత అందంగా ..సున్నితంగా వస్తుందనే ఉద్దేశంతోనే అంజులి శుక్లాకు కుట్టి స్రంక్ ద్వారా తొలి అవకాశాన్నిచ్చాడు షాజి కరుణ్. ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని దర్శకుడి అంచనాని మించిన నైపుణ్యాన్ని చూపి తన ప్రత్యేకతను ఫ్రేమ్ చేసుకుంది అంజులి.

ఆ కథా కమామీషు
పుణె ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో సినిమాటోగ్రఫిలో శిక్షణ పొందిన అంజులి శుక్లాను షాజి కరుణ్ 'కుట్టిస్రంక్' సినిమాకు ఛాయాగ్రహణం అందివ్వాలని అడిగినప్పుడు భయపడలేదు. ఆ బాధ్యతను ఆత్మవిశ్వాసంతో అందుకుంది.'స్వయంగా సినిమాటోగ్రాఫర్ అయిన షాజి కరుణ్ సినిమాకు ఫోటోగ్రఫీ అందించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే చిత్రీకరణకు ఆయన పెట్టింది పేరు.

రెనెటో బెరో, సంతోష్ శివన్, సన్నీ జోసెఫ్, హరి నాయర్‌లా ఆయన సినిమాలు దృశ్యకావ్యాలు. అలాంటి డైరెక్టర్ వచ్చి నా సినిమాకు నువ్వు ఫోటోగ్రఫి అందించాలని అడిగారంటే...ఇంతకన్నా అదృష్టం ఉంటుందా..? అందుకే వెంటనే ఒప్పుకున్నాను. ఆశ్యర్యమేసింది కాని భయపడలేదు. నా మీద ఆయనకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము కానివ్వలేదు' అని ఆ సినిమా అవకాశం గురించి చెప్పింది ఆమె. ఈ సినిమా షూటింగ్ వర్షాకాలం ఆరంభంలో మొదలైందట. అందుకే ఈ సినిమాలో వర్షం సీన్లకు ట్యాంకర్లతో వర్షం కురిపించాల్సిన బాధ తప్పిందని చెప్పింది అంజులి నవ్వుతూ.

నేపథ్యం
అంజులి శుక్లా పుట్టిపెరిగింది లక్నోలో. సినిమా నేపథ్యం ఏమాత్రంలేని కుటుంబం నుంచి వచ్చింది. కనీసం ఆమె పెరిగిన లక్నో ముంబై, చెన్నై, కోల్‌కత్తాల్లా కాదు. సినిమా వాసనలే మాత్రం సోకని ఊరు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి సినిమా రంగంలో...అందునా పురుషాధిపత్యంలో ఉన్న ఫోటోగ్రఫీలో నిలదొక్కుకోవడం అంటే ఓ సవాలే.

ఆ రంగాన్ని ఎంతో ఇష్టపడితే తప్ప సాధ్యం కాదు. అలాంటి ఇష్టంతోనే ఫిల్మ్‌మేకింగ్ నేర్చుకోవడం కోసం పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయింది అంజులి. అయితే తన తపనకు ఫోటోగ్రఫీ అయితేనే బాగా నప్పుతుందని గ్రహించి తర్వాత ఆ శాఖలో చేరింది. 'ఒక విషయాన్ని దృశ్యంగా మలచడానికి ఉవ్విళ్లూరుతుంటాను' అంటుంది ఆ రంగంలో ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అంజులి.

కెరీర్ తొలినాళ్లు
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత అంజులి మొదట సంతోష్ శివన్‌కు కెమెరా అసిస్టెంట్‌గా ఓ పన్నెండు సినిమాలకు పనిచేసింది. వాటిలో 'బిఫోర్ ది రైన్స్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్' అనే రెండు హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. 'సంతోష్‌శివన్‌తో పనిచేయడమంటే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ నుంచి అన్ని ముఖ్యమైన శాఖల్లో లీనమవడమే.

ఆ అనుభవం ఎంతో నేర్పుతుంది' అంటూ సంతోష్ శివన్ పనివిధానాన్ని మెచ్చుకుంది అంజులి. ఛాయాగ్రాహకుడు మనోజ్ పిళ్లై తో కలిసి 'అచనురంగథ వీడు' అనే సినిమాకూ పనిచేసింది. 'మనోజ్ పిళ్లై మొదటి సినిమా 'అచనురంగథ వీడు'కు పనిచేయడం గొప్ప అనుభవం. అంతకు ముందు సంతోష్ శివన్ చాలా సినిమాలకు నేను, పిల్లై ఇద్దరం కలిసి పనిచేశాం' అని ఆజ్ఞాపకాలను నెమరువేసుకుంది ఆమె.

అనుభవమే కాదు అవకాశం కూడా
ఈ మహామహులందరి దగ్గర పని చేయడం గొప్ప అవకాశమే కాదు మంచి అనుభవం కూడా. షాజి కరుణ్ 'కుట్టిస్రంక్'కి మొదటిసారిగా పూర్తి ఛాయాగ్రహణం అందివ్వడం మరిచిపోలేని అనుభూతే కాదు నా నైపుణ్యానికి ఆయనిచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఆ అవకాశమే నన్నివ్వాళ జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాగ్రాహకురాలిగా నిలబెట్టింది. ఇది నా తొలి మెట్టుగా భావిస్తున్నాను. ఇంతకన్నా మాటలు రావడం లేదు చెప్పడానికి' అంది సాధించిన విజయాన్ని తలచుకుంటూ అంజులి శుక్లా.

Wednesday, September 15, 2010

40 ఏళ్ల తర్వాత రే చిత్రం!

భారతీయ సినీ పరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతి గడించి పెట్టిన సత్యజిత్‌రే తీసిన ఒక డాక్యుమెంటరీ సినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సిక్కింపై తీసిన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అనుమతినిచ్చింది. సత్యజిత్‌రే తన సినీజీవితంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చిత్రాలతో పాటు కొన్ని డాక్యుమెంటరీలను కూడా తీసాడు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్‌పై తీసిన డాక్యుమెంటరీ వీటిలో మొదటిది.

1971లో సిక్కింపై ఒక డాక్యుమెంటరీ తీయమని అప్పటి సిక్కిం రాజు పాల్డిన్ థాండ్అప్ నగ్యాల్, ఆయన భార్య హోప్ కుకీలు సత్యజిత్‌రేను కోరారు. ఆ సమయంలో సిక్కిం రాజరికపు పాలన కింద ఉండేది. మొదట ఈ డాక్యుమెంటరీని తీయటానికి సత్యజిత్ రే అంగీకరించలేదు. తాను సినీ దర్శకుడినని.. డాక్యుమెంటరీలు తీయనని స్పష్టం చేశారు. అయితే రాజదంపతుల ఒత్తిడి పెడితే డాక్యుమెంటరీని తీయటానికి చివరకు అంగీకరించారు.

దాదాపు ఏడాదిన్నర సమయం వెచ్చించి సత్యజిత్ రే ఈ డాక్యుమెంటరీని తీశారు. సిక్కిం రాచరికపు వైభోగాలతో పాటు, అతి సామాన్యుల కష్టసుఖాలను కూడా సత్యజిత్‌రే ఇందులో చిత్రీకరించారు. సిక్కిం రాజభవనంలోని ఒక ప్రాంతంలో రాజకుటుంబీకులు తిని పారేసిన ఆహారపదార్థాల కోసం కొందరు ముష్టివాళ్లు కొట్టుకోవటాన్ని కూడా సత్యజిత్‌రే చిత్రీకరించారని- ఈ డాక్యుమెంటరీని చూసిన వాళ్లు చెబుతారు.

వాస్తవాలను అద్దంలో చూపించిన ఈ డాక్యుమెంటరీ రాజదంపతులకు నచ్చలేదు. దానిలో కొన్ని సీన్లను తొలగించమని సత్యజిత్‌రేను కోరారు. కాని తొలగించిన తర్వాత కూడా డాక్యుమెంటరీ రాజదంపతులకు నచ్చలేదు. 1975లో భారతదేశంలో సిక్కిం విలీనమయింది కాని సిక్కిం మీద తీసిన డాక్యుమెంటరీని బహిరంగ ప్రదర్శనకు అనుమతిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావించింది. దీనితో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది.

అయితే దీన్ని విదేశాలలో జరిగిన కొన్ని చిత్రోత్సవాలలో ప్రదర్శించారు. రెండు ప్రింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లోను, మరొకటి ఇంగ్లాండ్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఉన్నాయి.

దీని ప్రదర్శనకు అనుమతించాలని చాలా కాలం నుంచి సత్యజిత్‌రే అభిమానులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే ఏడాది మేలో జరగనున్న సత్యజిత్ రే 90వ జయంతి వేడుకలలో దాన్ని ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సత్యజిత్‌రే తీసిన డాక్యుమెంటరీని చూసే అవకాశం మనకు కలగనుంది.

Wednesday, September 1, 2010

' Show case '

ఢిల్లీలో బెల్జియంకు చెందిన ప్రముఖ నగల సంస్థ ఒర్రా తయారు చేసిన డైమండ్‌ బస్తీర్‌(టాప్‌)ను ప్రదర్శిస్తున్న బాలీవుడ్‌ నటీమణి మలైకా అరోరాఖాన్‌. ఈ టాప్‌పై 500 కారట్‌ల బెల్జియం డైమండ్‌లు పొదిగారు. దీని ధర సుమారు 1.3 మిలయన్‌ డాలర్లు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.

malaika


malaika


malaika

Jai Ho .............